మేరు
ఐరిష్ కవి విలియం బట్లర్ యేట్స్ (1865 - 1939) రచించిన కవిత మేరు (1934) కి స్వేచ్ఛానువాదం... నాగరికత పెనవేసుకు పోయింది, లోబడి ఒక శాసనానికి, శాంతి అనే ఓ ఆకృతికి, వన్నె వన్నెగా భిన్న భిన్నంగా అల్లుకుపోయిన మాయకి; తలపుల వడి మనిషి జీవితం, భయంతో భీతిల్లినా మనిషి ఆపలేడు మారణహోమం, యేళ్లు శతాబ్దాలు అయినా శతాబ్దాలు యుగాలైనా శమించని ఆకలితో ప్రళయ తాండవం చేస్తో, సర్వ విధ్వంసం కావిస్తో వచ్చేది ఎడారి వంటి వినాశనమైన వాస్తవంలోకే: ఈజిప్టు మరియు గ్రీకు రాజ్యాలకు వీడ్కోలు, వీడ్కోలు రోమ్ మహాసామ్రాజ్యానికి. ఋషులు మేరు పర్వతం పైన, యోగులు హిమాలయాల్లో మంచు కప్పిన ఆ గుహల్లో, ఎముకలు కొరికే శీతాకాలపు హిమ పాతం తమ నగ్న శరీరాలను చాకుల్లా తాకుతున్నా, వారికీ తెలుసు పగటి వెంబడే చీకటి వస్తుందని, ఉషోదయానికి ముందే మనిషి యొక్క ప్రశస్తి మనిషి కట్టిన సౌధాలు తృటిలో బూడిదై పోతాయని.