కార్తీక మాసం - నా గురుతులు
న కార్తికసమో మాసో న కృతేన సమం యుగమ్, న వేదసదృశం శాస్త్రం న తీర్థం గంగయా సమమ్ స్కంద పురాణంలోనిది ఈ శ్లోకం. కార్తీకమాసానికి సమానమైన మాసమేదీ లేదు; సత్యయుగంతో సమానమైన యుగమేదీ లేదు; వేదములతో సమానమైన శాస్త్రమేదీ లేదు; గంగానది వంటి ఇతర నదేదీ లేదు. దీపావళి అయిన మరునాడే మొదలయ్యే కార్తీక మాసానికి ఇంత ప్రాముఖ్యత ఎందుకు? కార్తీక పురాణం స్వయాన విష్ణుమూర్తి లక్ష్మీదేవికి, పరమేశ్వరుడు పార్వతీదేవికి, బ్రహ్మదేవుడు నారదుడికి చెప్పాడని నమ్మకం. వసిష్ఠుడు రాజయోగి అయిన జనక మహారాజుకు చెప్పగా, అయన ఆచరించి లోకులకు తెలియజేసాడని ప్రతీతి. ఎంతో ఉత్సాహంగా, సామూహిక సంబరాలతో కనులవిందుగా జరిగే నవరాత్రులు, దీపావళి తరువాత, నిష్ఠతో అంతర్దృష్టులై ఆడంబరాలు వదిలి లోకేశుని ధ్యానంలో గడపటానికే కార్తీక మాసం అని మా నాన్నగారు చెప్పేవారు. అయన చిన్నతనం అంతా గోదారి గట్టున, కోనసీమలోని తొండవరం అనే కుగ్రామంలో గడిపారు. వారి తండ్రి (మా తాతగారు) ప్రతీ దినం గోదావరి మట్టితో పార్థివ లింగం చేసి అభిషేకించి తిరిగి నదిలోనే కలిపేవారట. పంచభూతాల మిశ్రమం ఈ మట్టి ఈ భూమి. తరతరాలుగా, యుగ యుగాలుగా ప్రవహించేవి మన జీవనదులు. వాటి పంచన కోటానుకోట్ల జీవ...